No title


 *క్రమం తప్పకుండా వ్యాయామమే హృద్రోగ సమస్యకు పరిష్కారం* 


 *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్* 


 *రమేష్ హాస్పటల్స్ నేతృత్వంలో జాతీయ హృద్రోగ నవీకరణ (కార్డియాలజీ అప్డేట్) సదస్సు* 


 *సోమరాజు, దాసరి ప్రసాదరావు, ప్రసాద్ లాల్ లను సత్కరించిన గవర్నర్* 


 క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గుండె ఒక కండరం కాగా, ఇతర కండరాల మాదిరిగానే వ్యాయామం ద్వారా అది బలపడుతుందన్నారు. రమేష్ హాస్పటల్స్ నేతృత్వంలో విజయవాడలో ఆదివారం నిర్వహించిన జాతీయ హృద్రోగ నవీకరణ (కార్డియాలజీ అప్డేట్) సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శుద్ది చేయబడిన, తక్షణ శక్తి కారక ఆహార వినియోగం, శారీరక శ్రమ కోసం యంత్రాలపై ఆధారపడటం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంత జనాభా అధికంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారన్నారు. ధూమపానం, మద్యపానం, కనిష్ట శారీరక శ్రమ, తగినంత మేర కూరగాయలు, పండ్ల వినియోగం లేకపోవటం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

 

 ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి నిత్యం వ్యాయామం ఉత్తమ మార్గమని, ఇది అధిక రక్తపోటు ను నివారిస్తుందని వివరించారు. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను వ్యాయామం మరింత సమర్థవంతంగా పనిచేయించి, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందన్నారు. నడక, ఈత, నాట్యం వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని, సాంప్రదాయ జీవనశైలితోనే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేసారు. ప్రతి సంవత్సరం 90 లక్షల మరణాలకు కారణమయ్యే గుండె జబ్బు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్ గా ఉందన్నారు. దేశంలో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు విభిన్న రకాల హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని, మరోవైపు ప్రపంచంలోని మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఆరవ వంతు మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతుండగా, సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులు లేకపోవడం వల్ల ప్రజలు అంటు వ్యాధులు బారిన పడుతున్నారన్నారు.


  దేశంలో మూడింట ఒక వంతు మంది వృద్ధులు రక్తపోటు, 5.2 శాతం మంది దీర్ఘకాలిక గుండె జబ్బులు, 2.7శాతం మంది గుండె పోటుతో బాధపడుతున్నారని గవర్నర్ వివరించారు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్, గుండె జబ్బులు, టిబి, డయేరియా, తక్కువ బరువుతో జన్మించటం వంటివి మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు. హృద్రోగ నవీకరణ సదస్సు కుటుంబ వైద్యుల వ్యవస్థను పటిష్టం చేయటంతో పాటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలను నివారించడంలో మార్గదర్శిగా నిలుస్తుందన్న విశ్వాసం తనకుందని గవర్నర్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2015లో నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి 2030 నాటికి నాన్-కమ్యూనబుల్ వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను మూడింట ఒక వంతు తగ్గించవలసి ఉందని, వీటిలో హృదయ సంబంధ, శ్వాసకోశ, క్యాన్సర్, మధుమేహ వ్యాధులు ఉన్నాయన్నారు. 


 దేశంలో దాదాపు నాల్గవ వంతు మరణాలు హృదయ సంబంధ వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయన్నారు. మన దేశంలో తొలి మయోకార్డియల్ సమస్య 53 సంవత్సరాలకు వస్తుండగా, ఇది అభివృద్ధి చెందిన దేశాలలో 63 సంవత్సరాలుగా ఉందన్నారు. రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. రమేష్ బాబు కీలకోపన్యాసం చేయగా, కార్యక్రమంలో భాగంగా సీనియర్ హృద్రోగ నిపుణులు, ఎఐజి హాస్పటల్స్ డాక్టర్. బి. సోమ రాజు, నిమ్స్ మాజీ అధినేత డాక్టర్ దాసరి ప్రసాదరావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ లాల్ తదితరులను గవర్నర్ సత్కరించారు. రమేష్ హాస్పిటల్స్ ఛైర్మన్ రామమోహన రావు, ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ఆజాద్ మూపెన్, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు, మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరాజు, ప్రముఖ విద్యావేత్త ఎంసి దాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.